Thursday, May 14, 2020

పరిప్రశ్న

మోక్ష విషయమై ఎటువంటి గురువులని ఎలా ఆశ్రయించాలి అన్నసందేహానికి శ్రీ కృష్ణ భగవానుడు గీతలో ఇలాగ చెప్పాడు:

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః (భగవద్గీత 4:34)

భావము: అట్టి జ్ఞానమును తత్త్వవేత్తలగు జ్ఞానులకు (చక్కగా) సాస్టాంగ నమస్కారమొనర్చి, (మోక్షమును గూర్చి) ప్రశ్నించి, సేవచేసి తెలుసుకొనుము. వారు తప్పక ఉపదేశించెదరు.
గమనిక: ఇదే గీతాశ్లోకమును గూర్చి శ్రీసాయి సచ్చరిత్ర లో 39వ అధ్యాయములో చర్చించబడియుంది.

ఏ ప్రశ్నల జావాబులు మనకి మోక్ష తత్త్వజ్ఞానాన్ని అందిస్తాయో అలాంటి వాటిని పరిప్రశ్నలు అంటారు. మరి ఎలాంటి ప్రశ్నలు వేయాలి అన్న సందేహం కలిగినట్లైతే చక్కటి ఉదహారణము శ్రీ భీష్మపితామహులవారిని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగిన ప్రశ్నలు మనము నెమరువేసుకొంటె సరిపోతుంది (ఇవే కాక నచికేతుడు యముడిని అడిగినవి, గౌతముడు జాబాలాసత్యకాముడిని అడిగినవి కూడా అదే కోవలోకి వస్తాయి).

విష్ణుసహస్రనామములో పూర్వపీఠికలో 'కిమేకం దైవతం లోకే' మొదలుకొని 6 (పరి)ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు. భీష్ముడి సమాధానములో మనకి కలిగే మంచిజ్ఞానబోధ ఎమిటంటే తరచుగా హరినామసంకీర్తనము చేయడం.
ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలు:
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం| స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః| కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||

1వ ప్రశ్న: కిమేకం దైవతం లోకే? (కిం లోకే ఏకం దైవతం) (లోకము నందు ఒక్కగానొక్క దైవము ఏమిటి?)
సమాధానం: పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం| దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||

2వ ప్రశ్న: కిం వా ప్యేకం పరాయణం? (కిం వ ఏకం పరాయణం అపి) (ఒక్కగానొక్క అంతిమ గమ్యం/ ఆశ్రయం ఏమిటి మరి?)
సమాధానం: పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః| పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||

3వ ప్రశ్న: స్తువంతః కం ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం స్తువంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని స్తుతించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం| లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||

4వ ప్రశ్న: క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం అర్చంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని అర్చించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం| ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||

5వ ప్రశ్న: కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః? (భవతః మతః కః ధర్మః సర్వధర్మాణాం పరమః)
(అన్ని ధర్మములలోకెల్లా యే ధర్మము పరమోత్కృష్టమైనది అని మీ అభిప్రాయం?)
సమాధానం: ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః| యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||

6వ ప్రశ్న: కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్? (కిం జపన్ జంతుః జన్మ సంసార బంధనాత్ ముచ్యతే) (ఏమి జపం చేత ప్రాణులు పుట్టుక, సంసార బంధనం నుండి విమోచనం పొందుతున్నారు?)
సమాధానం: జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం| స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః

సారాంశం: హరినామ సంకీర్తన వల్ల సర్వ పాపాలు, కర్మలు నశించి మరో జన్మలేకుండా మోక్షం లభిస్తుంది అన్నది సారాంశం.
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః | సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| (కృష్ణుడిని ఆశ్రయించిన మనుషులు సకలపాపాలు నుండి పూర్తిగా శుద్ధిపొంది ఎప్పటికి తిరిగిరాకుండా శాశ్వతముగా కృష్ణుడి దగ్గరికే వెళ్తారు)

 శ్రీ గురు గౌరాంగౌ జయతః (All glories to Guru and Gauranga)

సూచన: విష్ణుసహస్రనామం శంకరభాష్యంతో పాటు తెలుగు టీకాతాత్పర్యాలు ఉన్న పాత పుస్తకం (మా ముత్తమామ్మగారు కొన్నది) ఇంకా మా దగ్గర ఉంది. పుస్తకం కొత్త కాపీ కోసం వావిళ్ళ ప్రెస్స్ వారిని సంప్రదించగలరు (+91 98495 69921) . ఇప్పటి వెల 75రూ మాత్రమే.

Monday, May 11, 2020

పిండి నేర్పిన గుణపాఠం

చాలా నెలలు నా దగ్గర గోధుమ పిండి నిల్వ ఉండేది కానీ దాన్ని ఎప్పుడు చూసినా "చపాతీలు అస్సలు చేసుకోను కాబట్టి ఇంత పిండిని నేనేమి చెయ్యాలి? మొత్తం వృధా కదా" అని విసుక్కునేవాడ్ని. కరోనా పుణ్యమాని ఎక్కువ బయటకి వెళ్లలేక ఉన్నదానితో సరిపెట్టుకొనే వింత పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేది లేక హతవిధి అనుకుని చపాతీపిండి తీసి చెల్లాయిని అడిగి మొత్తానికి ఒక పూట ఫుడ్ కానిచ్ఛేసాను. ఎందుకో అది సులువు అనిపించి తర్వాత మేథీ పరాఠా, ఆలూ పరాఠా అని చకచకా వండుకోడంతో పిండి దాదాపు అయిపోవచ్చింది. "అరెరె 2కేజిల గోధుమపిండిని అవగొట్టడం నావల్ల కానే కాదు అనుకొన్నాను కానీ వారం తిరగకుండానే అయ్యిపోయిందే!", అని ఆశ్చర్యపోడం నా వంతు అయ్యింది. అప్పుడు, హఠాత్తుగా ఒక ఆలోచన నా మదిలో మెదిలింది.
"దేవుడు మనకి నిర్ణయించే ప్రణాళిక మనం ఈ జన్మలో చేయలేనంత కష్టంగా అనిపించవచ్చు. మన కర్మఫలం తరగని కొండలాగా భయపెట్టవచ్చు....మనం చేరుకోవాల్సిన లక్ష్యానికి ఎన్నో అడ్డంకులు ఎదురుపడవచ్చు. కానీ మన పని, లక్ష్యం, కర్మ.... మనం బద్ధకాన్ని వదిలిపెట్టి మొదలెడితే చాలు. విశ్వాసంతో ముందడుగు వేస్తే ఇవన్ని ఆనతి కాలంలోనే పూర్తిచేయ్యగలము. అది ఏదైనా కావొచ్చు.. అది సఫలం అవ్వడం తథ్యం." అని.
అహా! మనం అహంకారాన్ని పక్కనపెట్టి నేర్చుకోవాలే గాని పిండి కూడా మంచి గుణపాఠం అందించగలదు.

Thursday, May 7, 2020

విశాఖపట్నంలో గాస్ లీకేజీ

విశాఖపట్నంలో గాస్ లీకేజీ వార్తా చాలా బాధపెట్టింది. కరోనా వైరస్ సాకుతో మార్చ్ నుండి మైంటెనెన్సు పనులు నిలిపివేశారుట. కొంతమంది స్వార్థం, ఉదాసీనత, అజాగ్రత్త వల్ల ఇంతమంది అమాయకులు బలికావడం చాలా విచారకరం. అభివృద్ధి అంటే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు. సామాజ పురోగతికి నాణ్యత కల్గిన విద్య, వైద్యం, రక్షణ, పౌరసేవ ఇలాంటివి సూచికలు. ఇవి ఎంతమేరకు మెరుగుపడ్డాయి అన్నవి ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి.
నా పీ.హెచ్ది.లో 'public protection and disaster relief' (PPMR, ప్రజా సంరక్షణ మరియు విపత్తు ఉపశమనం) సంబంధించి కొంత పనిచేయడం జరిగింది. ఒక విపత్తు జరిగినప్పుడు దానినుండి జనాలకి అత్యంత త్వరగా ఎలాగ సహాయచర్యలు తీసుకోవాలి?, అందులోంచి వారిని ఎంతత్వరగా బయటకి తీసుకురావాలి? ఈ విషయంలో 5జి కమ్యూనికేషన్స్ పాత్ర మీద నా పరిశోధన కొనసాగింది.
'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు' లాగ మన ప్రభుత్వాలు పనిచేయడం చాలా దారుణం. మన యువతకి ఉపాధి కల్పించాలి అంటే పరిశ్రమలు చాలా అవసరం. కానీ ఒక పరిశ్రమని నెలకొల్పినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు జరుగవచ్చు అనేది ముందుగానే ఒక అంచనాకి వచ్చి అందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలి. దీన్నే మా పరిభాషలో forward error correction అంటారు. ఇలాంటి గంభీరమైన అంశాలు గురించి ఆలోచించడం మానేసి సులభమార్గాల్లో రాబడి పెంచుకోవాలని జనబాహుళ్యంలో పేరుకుపోయిన మద్యపాన బానిసత్వాన్ని సొమ్ము చేసుకోడం పైనా దృష్టి పెట్టడం చాలా ఖండించాల్సిన విషయం.
మన పిల్లలకి మనం అందించే నిధి కేవలం మన బ్యాంకు బాలన్స్, స్థిర ఆస్తి మాత్రమే కాదు... కాలుష్య రహితమైన పర్యావరణం కుడా.... వందే మాతరం

భయం - ఆనందం (అమ్మ చెప్పిన మాట)

ఇది మా అమ్మగారు రాసారు. పేరు వెంకటలక్ష్మి. ఆవిడకి ఇప్పటి అంతర్జాలం పైన అంత అవగాహన లేకపోడంతో అవిడతరపున నేను దీన్ని మిత్రులందరికి పంచుతున్నాను.
"భయం, ఆనందం వీటిని అనుభవిస్తూనే మనిషి మనుగడ సాగిస్తాడు కానీ మనిషి వివేచించి భయాన్ని పారద్రోలి ఆనందాన్ని ఆస్వాదించాలి...దానికి కావలసింది కాస్త ఓర్పు..నేర్పు..
పొత్తిళ్ళలో పసిపిల్లాడు పక్కకు తిరగాలంటే భయపడతాడు కొన్ని రోజులకి పక్కకు వత్తిగిలి ఆనందంగా నిద్రపోతాడు. అప్పుడు తల్లికి భయం మెుదలవుతుంది పడినపిల్లాడిని హత్తుకోని ఆనందిస్తుంది.
అడుగులు వేసేటప్పుడు అమ్మ చేయి వదలడానికి భయపడతాడు మరికొన్ని రోజులకి ఆనందంతో పరుగులు పెడతాడు. అప్పుడు వాడికి అంతా ఆనందంగా వుంటుంది.
తరువాత అమ్మని వదలి స్కూలికి వెళ్ళాలి అంటే భయం. అక్కడ నేర్చుకొన్నవి అమ్మ మెచ్చుకొంటొంటే ఆనందంతో స్కూలికి పరుగులు తీస్తాడు.
అలాగ చదువు ముగిసి ఉద్యోగానికి వెళ్ళాలంటే భయం ఈ ఉద్యోగం ఏమిటిరా బాబు అని... బాస్ అంటే భయం..ఉద్యోగం నిలుపుకోగలనో లేనో అనే భయం...నెలాకరున తోలిజీతం తీసుకొనేసరికి దేశాన్ని గెలిచినంత ఆనందం...పర్మినెంటు అయ్యిందంటే అనంతమైన ఆనందం.
తరువాత వివాహం అంటే భయం జీవిత భాగస్వామి ఎటువంటి వాళ్ళోస్తారోనని...ఇంక అత్తంటే భయం (భారం).... ఆడపడుచంటే భయం....ఇంక భార్యా భర్తల మధ్య ఒకరంటే ఒకరికి భయం...కోడలంటే అత్తకు భయం ఎందుకు. ఈ భయాలు అని ఆలోచిస్తే మనం కుాడా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అంటూ వచ్చినవాళ్ళమేగా... అందరూ మనవాళ్ళనుకోని కొంచం ఓర్పు, నేర్పుతో ఉంటూ కొత్తదంపతులు కలిసేలాగ రెండుకుటుంబాలు కలిసి మెలిసి మనగలిగిననాడు అందరికీ ఆనందమేగా...
కుటుంబాలు బాగుంటే ఊరు బాగుంటుంది...ఊరుబాగుంటే రాష్ట్రం...దాన్నిబట్టి దేశం..మోత్తం ప్రపంచమే బాగుంటుంది. దానికి కావలసింది ఓర్పు, సహనం, త్యాగం (ఈరోజు ఈకరోనా రానే రాదుగా)
"కలసి వుంటే కలదు సుఖం"
మనవలు వాళ్ళ ఆటపాటలతో ముసలితనం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చాక మరణభయం...మనం ఎక్కడ నుంచి వచ్చాము? భగవంతుని దగ్గర నుంచే కదా అని ఒక్క క్షణం ఆలోచించామంటే...మనం వచ్చిన చోటుకే కదా వెళ్ళేది (భగవంతుని దగ్గరికి) అనుకొని...ఒక ఆడపిల్ల పుట్టింటికి ఎంత ఆనందంగా వెడుతుందో అంతే ఆనందంగా పుట్టినచోటుకే వెడుతున్నామనుకొంటే అంతా ఆనందమేగా (ఆడపిల్ల అత్తారింటిలో స్వతంత్రంగా వుండలేదు పుట్టింట్లో స్వతంత్రంగా వుంటుంది). మనము మన మరణ సమయంలో భగవంతుని దగ్గరకి వెడుతున్నామని ఆయన తలపులతో ఆనందంగా ప్రాణం వదిలిన నాడు మనకి మోక్షానందమే కదా."
(6/4/2020, అమ్మ)

Sunday, May 3, 2020

మంచి-చెడు

ఈ సమాజంలో చెడ్డవాళ్ళ పట్ల జాలి ఉన్నంతగా మంచివాళ్ళ పైన మమకారం ఉండదు ఎందుకో...చెడ్డవాళ్ళ నూరుతప్పులను "వాడంతే" అని సహిస్తుంది కాని మంచివాళ్ళు ఒక్క తప్పటడుగు వేస్తే చాలు భూతద్దం పెట్టి మరీ చూపిస్తుంది...
తనకి ఉన్న శక్తి, కాలం, అధికారం, అందం, డబ్బు ఇవన్ని చేజారిపోయిన తర్వాత మేలుకొలుపు వస్తే అది నిజమైన మార్పు ఎలా అవుతుంది... "వృద్ధనారీ పతివ్రతా" అన్న సామెత చందంగా గత్యంతరం లేకమారినట్టు అవుతుంది గాని... ఒకవేళ వాళ్ళకి పూర్వ స్థితి కల్పిస్తే ఇప్పటిలాగనే బుద్ధిగా ఉంటారా? లేక పాతబాట పడతారా? అన్నది కూడా చూడాలి...అప్పుడే ఆ మార్పులో నిజాయితి బయటపడుతుంది..
పుట్టినప్పుడు అందరు మంచివాళ్ళే. అవకాశాలు అన్నీ ఉన్నప్పుడు కూడా చెడుకి ఆకర్షితుడనివాడు గొప్ప. ఒకటి రెండు తప్పులు జరిగినా అవి సరిదిద్దుకుని తనలోని మంచికి మెరుగులు దిద్దేవాడు గొప్ప.
"మంచితోలు" కప్పుకొని అవకాశనికి తగ్గట్టుగా చిలకపలుకులు వల్లించే వారి మాటలెపుడూ తియ్యగానే ఉంటాయి... ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళ మాటలు నిష్టూరంగా అనిపిస్తాయి...
మూసపోతకి భిన్నంగా ఉన్నతంగా ఉంటే సమాజం భరించలేదు.
అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ అణిగి అణకువతో ఉండడం అవకాశాలు వచ్చినప్పటికి చెక్కు చెదరని స్ధైర్యంతో దేనికి ఆకర్షితుడు కాకపోవడం ఎట్టిపరిస్తితిలోను ధర్మ మార్గాన్ని వదలక పోవడం గొప్ప. తెలియక తప్పులు చేసినా సరిదిద్దుకుని మంచికి మెరుగులు దిద్దుకునే వాడు గొప్పవాడు.
ఇటువంటి వారు లౌకిక జీవితంలో ఓడినట్లు కనిపిస్తారు. కానీ వారి వెనుక రక్షణకవచంలా భగవంతుడుంటాడని తెలుసుకోరు ధర్మోరక్షతి రక్షితః

Saturday, May 2, 2020

ఏం తెలుసు?

వాసనలేని పూలకేం తెలుసు
వసంతకోకిల రాగాలాపనలు
ఆర్ద్రత లేని మనసు చూడగలదా
మాటరాని కంటిచూపుల గురి
వెలుగు చుడని కళ్ళకి
మిణుగురు పురుగుల చావు
బోధపడుతుందా?
దయలేని సంఘానికి
మంచితనమంటే తెలుసా?
కౄరత్వపు కారుచీకట్లు
కమ్మిన మనిషికి
కరోనా వచ్చినప్పుడైనా
జ్ఞానోదయం కల్గునా?

(02/05/2020)