Thursday, May 14, 2020

పరిప్రశ్న

మోక్ష విషయమై ఎటువంటి గురువులని ఎలా ఆశ్రయించాలి అన్నసందేహానికి శ్రీ కృష్ణ భగవానుడు గీతలో ఇలాగ చెప్పాడు:

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః (భగవద్గీత 4:34)

భావము: అట్టి జ్ఞానమును తత్త్వవేత్తలగు జ్ఞానులకు (చక్కగా) సాస్టాంగ నమస్కారమొనర్చి, (మోక్షమును గూర్చి) ప్రశ్నించి, సేవచేసి తెలుసుకొనుము. వారు తప్పక ఉపదేశించెదరు.
గమనిక: ఇదే గీతాశ్లోకమును గూర్చి శ్రీసాయి సచ్చరిత్ర లో 39వ అధ్యాయములో చర్చించబడియుంది.

ఏ ప్రశ్నల జావాబులు మనకి మోక్ష తత్త్వజ్ఞానాన్ని అందిస్తాయో అలాంటి వాటిని పరిప్రశ్నలు అంటారు. మరి ఎలాంటి ప్రశ్నలు వేయాలి అన్న సందేహం కలిగినట్లైతే చక్కటి ఉదహారణము శ్రీ భీష్మపితామహులవారిని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగిన ప్రశ్నలు మనము నెమరువేసుకొంటె సరిపోతుంది (ఇవే కాక నచికేతుడు యముడిని అడిగినవి, గౌతముడు జాబాలాసత్యకాముడిని అడిగినవి కూడా అదే కోవలోకి వస్తాయి).

విష్ణుసహస్రనామములో పూర్వపీఠికలో 'కిమేకం దైవతం లోకే' మొదలుకొని 6 (పరి)ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు. భీష్ముడి సమాధానములో మనకి కలిగే మంచిజ్ఞానబోధ ఎమిటంటే తరచుగా హరినామసంకీర్తనము చేయడం.
ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలు:
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం| స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః| కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||

1వ ప్రశ్న: కిమేకం దైవతం లోకే? (కిం లోకే ఏకం దైవతం) (లోకము నందు ఒక్కగానొక్క దైవము ఏమిటి?)
సమాధానం: పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం| దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||

2వ ప్రశ్న: కిం వా ప్యేకం పరాయణం? (కిం వ ఏకం పరాయణం అపి) (ఒక్కగానొక్క అంతిమ గమ్యం/ ఆశ్రయం ఏమిటి మరి?)
సమాధానం: పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః| పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||

3వ ప్రశ్న: స్తువంతః కం ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం స్తువంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని స్తుతించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం| లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||

4వ ప్రశ్న: క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం అర్చంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని అర్చించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం| ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||

5వ ప్రశ్న: కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః? (భవతః మతః కః ధర్మః సర్వధర్మాణాం పరమః)
(అన్ని ధర్మములలోకెల్లా యే ధర్మము పరమోత్కృష్టమైనది అని మీ అభిప్రాయం?)
సమాధానం: ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః| యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||

6వ ప్రశ్న: కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్? (కిం జపన్ జంతుః జన్మ సంసార బంధనాత్ ముచ్యతే) (ఏమి జపం చేత ప్రాణులు పుట్టుక, సంసార బంధనం నుండి విమోచనం పొందుతున్నారు?)
సమాధానం: జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం| స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః

సారాంశం: హరినామ సంకీర్తన వల్ల సర్వ పాపాలు, కర్మలు నశించి మరో జన్మలేకుండా మోక్షం లభిస్తుంది అన్నది సారాంశం.
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః | సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| (కృష్ణుడిని ఆశ్రయించిన మనుషులు సకలపాపాలు నుండి పూర్తిగా శుద్ధిపొంది ఎప్పటికి తిరిగిరాకుండా శాశ్వతముగా కృష్ణుడి దగ్గరికే వెళ్తారు)

 శ్రీ గురు గౌరాంగౌ జయతః (All glories to Guru and Gauranga)

సూచన: విష్ణుసహస్రనామం శంకరభాష్యంతో పాటు తెలుగు టీకాతాత్పర్యాలు ఉన్న పాత పుస్తకం (మా ముత్తమామ్మగారు కొన్నది) ఇంకా మా దగ్గర ఉంది. పుస్తకం కొత్త కాపీ కోసం వావిళ్ళ ప్రెస్స్ వారిని సంప్రదించగలరు (+91 98495 69921) . ఇప్పటి వెల 75రూ మాత్రమే.

1 comment:

  1. చాలా బాగా వ్రాసారు.ఆశీస్సులు.

    ReplyDelete