Tuesday, January 27, 2015

ఉగాది వర్ణన

ఉగాది పండుగకు కేవలం మన ఆంధ్రదేశమే కాక ప్రకృతి కూడా పులకితమై పరవశిస్తున్నది.

ఎప్పుడెప్పుడు ఉదయిద్దామా అని ఉబలాటంతో కూడిన సూర్యుని యొక్క హృదయము నుండి జనించిన లేలేత ఉషస్షులు భువికి బయలుదేరాయి.

అప్పుడప్పుడే మంచుతెరలు విడిపోతున్నవి, పచ్చని చెట్లన్ని పక్షుల కిలకిలారావాలతో నిండిపోయాయి. ఆప్పుడప్పుడే వసంతకుసుమాలు విచ్చుకుంటున్నాయి. వాటి యొక్క సుగంధ పరిమళాలు ఉగాదికి ఆహ్వానపత్రిక వలె ఉన్నవి.

అప్పుడే చిగుర్చిన వేప చిగుళ్ళు తమ భవితవ్యాన్ని ఉగాదికి అంకితం చేశాయి. భ్రమరాలు ఝుంకారనాదాలతో కుసుమాగ్రాలను చేరి వాటిలోని మకరందాన్ని గ్రోలుతున్నయి.

అంత మునుపటి వరకు వెన్నెలతో నిండిన ప్రకృతి నూతనోల్లాసభరిత ఉషస్సులతో వెల్లి విరిసింది. సెలయేటి శబ్దాలు సప్తస్వరములను అనుకరింపగా, సుర్యకాంతపుతొడుగులతో అవి బంగారు వన్నెను కలిగి తళతళలు ఆడుతున్నవి.

పచ్చని పైర్లలో ఉద్భవించే జానపదాలు ఉగాది పండుగలోని మాధుర్యాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఫ్రతి తిమ్మెర గాలికి ఊగిసలాడుతూ పసిడి పంటలు వాటి పారవశ్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఆటపాటలతో తెలియాడే పిల్లలు, దినసరి కార్యక్రమములలో సతమతమయ్యే పెద్దలు సైతం వయోభేదం లేకుండా షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి కోసం చేసే నిరీక్షణ, ఉగాది పండుగ యొక్క గొప్పదనాన్ని చెప్పకనే చెబుతున్నది.

(2004 ఉగాదికి ప్రసంగించిన కవిత)

No comments:

Post a Comment