Tuesday, January 27, 2015

ఆనంద సద్విలాపము

ముందుమాటఆనందాన్ని మంచి, చెడులనే గుణాలు అంటవు. కాని విలాపము అలగకాదు, మంచి చెడు అనేవి భేదము దానికి వర్తిస్తుంది. మరి విలాపంలో ఏది సద్విలాపము అనగా, ఏదైతే భగవంతునికి సంబంధితమైన విలాపము ఉంటుందో అది మంచిది అని ఎంచబడుతుందని నా అభిప్రాయం. ఒక విషయము లేదా వ్యక్తిపైన ఆనందసద్విలాపములు రెండు ఏకకాలములోనో లేక వెనువెంటనే కలిగితే అదెట్లుంటుందోనని ఊహించినప్పుడు నా మదిలో మెరిసినదే ఈ క్రింది సీతాపరహణఘట్టమందలి రామునిపట్ల ఇతరులకు కలిగిన స్పందన.


ఓ మనసా! రాముడు ఎంత కృపాలుడో కదా
ఆర్తితో దరిజేరిన వారినెన్నడు విడువజలడే.

ఏమి ఉన్నదో కాన రాదు, శ్రీ రామ తారక నామమున!
ఎందరో పులకితులైరి అ దివ్యనామ శ్రవణమాత్రము చేత.

ఏమి భాగ్యము శబరి తల్లిది, తన హస్తములచేత స్వీకృతమైన ఫలభక్షాదులను ఆ భక్తవత్సలుడు ఆరగించెనె. ఇంత కాలము రామదేవుని సేవజేయలేక సమయము వృధా చేసితినే అన్న బాధ, ఇన్నేళ్ళకైనా ఆతడి సేవాభాగ్యము కలిగెనే అన్న అనందము శబరికి కలిగెను. ఆ మృదుసంభాషణుడు ఆమెతో ముచ్చటించు వేళలో, చుట్టు ప్రక్కలున్న జంతువృక్షాదులు తమకు ఆ భగ్యము కలుగలేదే అని విలపించసాగాయి. అయినను ఆ చిద్విలాసపురుషుడు తమ చెంతనే ఉన్నాడని గ్రహించి భావోద్వేగముతో కూడిన ఆనందాతిశయములను అవి వ్యక్తం చేసెను.

ఆంతవరుకు జగమంతయు ప్రచండముగా వీచి అలసి సొలసి ఉన్న వాయువు, రామదేవుని సమీపమున అలసట తీర్చుకొనుటకు తన వ్యర్ధ ప్రతామును విడిచి, పిల్లగాలి అయి అతిమెల్లగా మలయమారుతమై వీయసాగెను. ఆప్పుడే వాయువు తనలోని నిజసౌందర్యమును వీక్షించి సంతసించిన వాయువు, శ్రీ రామదేవుని సేవకు సమయము ఉపక్రమించలేక బాధానందమిళితుడై తన సుతుడైన హనుమంతుని శాశ్వత రామభక్తుడిని చేయుటకు మనోప్రతిజ్ఞ చేసెను. తాను స్వీయసేవ చేయలేకపోతినే అన్న బాధ, తన పుత్రుడు శ్రీ రామభక్తుడు అగుచున్నాడన్న ఆనందము ఆతనికి కలిగెను.

ఆంతకు మునుపు ఏంతో ఓర్పుతో భూభారం మ్రోసిన ఫుడమి, రాముని దీన ముఖకవళికలు పొడగనుటచేత హృదయవిదారకమై తన సహనమును కోల్పోయెను. తన దైనందిన కార్యభారము వల్లనో ఏమో, తన పుత్రిక కాన రాలేదే అన్న బాధ ఇసుమంతైనను రాలేదు కాని, ఈ అతిసున్నితహృదయుని చింత ఆమె యొక్క విలాపమునకు కారణమైంది. ఆంతలోనే రామదేవుడు భూమిపై ఉన్నాడనే స్పృహ కలిగి తాను మరల సహనమును తిరిగి పొందియుండెను. ఎక్కడ ఆ సీతాపతి యొక్క సున్నిత మృదుపాదములు కందిపోతవొ కదా అని ఆమె నొచ్చుకుని, అంతలోనే ఆ దీనదయాళుని భారము తను మొస్తున్నదని తెలిసుకొని నెమ్మదిని పొందెను.

యజ్ఞములనందు హవిస్సును సుదూర ప్రాంతములలో ఉన్న ఆయాలోకములందు వసించెడి దేవతలకు కొనిపోవుటకు తానే అర్హతను కలిగియున్న వాడినని అప్పటివరకు గర్వముతో విర్రవీగిన ఆగ్ని, సీతమ్మ తల్లిని అపహరించినది లంకేశ్వరుడగు రావణుడన్న చిరువార్త రామునికి తెలుపలేని తన నిస్సహాయతను తలచుకొని గర్వభంగమై అమిత దుఃఖమునకు లోనైయ్యను. రామదేవునికి ప్రత్యక్షముగా సహాయమును అందించలేకున్నా, రాబోవుకాలంలో మాయాసీతను లంకకు పంపి సీతమ్మతల్లిని రక్షించాలని కృతనిశ్చయుడయ్యెను. శ్రీ రామునికి యీ విధముగానైనా ఉపయోగ పడితినని తలచుకొని ఎట్టకేలకు ఆనందమును పొందెను.

సీతాపరహరణఘట్టమను విలపించుచున్న ఓ రామా, నీవే కాదయా విచారించునది, నీ అవస్థను చూచి ప్రకృతి సర్వం విలపించుచున్నది.

(2004)

No comments:

Post a Comment